ఈ మధ్యే ప్రారంభమయిన ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ రసవత్తర మ్యాచ్ లతో ఉత్కంటంగా కొనసాగుతుంది. అయితే ఈ లీగ్ ల వల్ల ఆయా ప్రాంఛైజీలు లాభాలు పొందుతున్నాయా...దీన్ని టెలికాస్ట్ చేస్తోన్న స్టార్ ఇండియా లాభాలను గడిస్తుందా? అంటే అవుననే సమాధానం చెప్పాలి.సమాచారం మేరకు ప్రో కబడ్డీ 5వ సీజన్ సుమారు రూ. 200 కోట్ల ఆదాయాన్ని సృష్టించింది. అయితే, ఈ సీజన్లో కొత్త జట్లు చేరడంతో పాటు ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు మార్కెట్ ఎనలిస్ట్లు. నిజానికి ప్రొ కబడ్డీ తొలి సీజన్ ఆరంభంలో ఫ్రాంచైజీలన్నీ ఆందోళన పడ్డాయి.కోట్ల రూపాయల పెట్టుబడులకు ఫలితం ఉంటుందా? అని ఆందోళన చెందాయి. అయితే, వారి అంచనాల్ని తలకిందులు చేసి... అనుకున్నదానికంటే ఎక్కువ మొత్తంలో ఆదాయం రాబట్టడంతో యజమానులు ఆనందపడ్డారు. పీకేఎల్ నిర్వహించే మాషల్ స్పోర్ట్స్లో స్టార్ వాటా కొనుగోలు చేయడం వల్ల కొందరు ఆందోళన చెందారు.పీకేఎల్లో మెజారిటీ వాటా అంటే 74 శాతం మాషల్ స్పోర్ట్స్ కలిగింది. టైటిల్ స్పాన్సర్షిప్, ఇతర ప్రకటనల ద్వారా స్టార్తో సమానంగా తమకు ఆదాయం రావడం లేదని విచారపడుతుంది. వాస్తవానికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)తో పోలిస్తే పీకేఎల్కు వ్యూయర్షిప్ చాలా ఎక్కువే.అయితే అందుకు తగ్గ స్పాన్సర్షిప్ ఆదాయం రావడం లేదు. ప్రస్తుతం పీకేఎల్లో ఒక్కో ఫ్రాంచైజీకి 5-10 స్పాన్సర్లు ఉంటున్నారు. సీజన్ను బట్టి, వ్యూయర్షిప్కు తగ్గట్టు వీరు డబ్బుని చెల్లించడం లేదు. ఉదాహరణకు ప్రధాన స్పాన్సర్ జెర్సీలపై తన బ్రాండ్ వేయిస్తున్నందుకు సీజన్కు రూ.1-3 కోట్ల వరకు ఇస్తున్నారని అనుకోండి.అయితే, సీజన్ కాలపరిమితిని బట్టి ఒక్కో మ్యాచ్కు రూ.15 లక్షలన్నమాట. ఇదే ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో రూ.5-10 కోట్లు, ఐపీఎల్లో రూ.10-20 కోట్లుగా ఉంది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. ఐఎస్ఎల్తో పోలిస్తే కబడ్డీ ఆటగాళ్లు టీవీలో కనిపించే సమయం కూడా ఎక్కువే.అయితే, ప్రో కబడ్డీలో ధోని, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ క్రీడాకారులు లేకపోవడం కూడా ఆదాయం తక్కువగా రావడానికి కారణమని భావిస్తున్నారు. ఇక, బ్రాడ్కాస్టర్ తమ ఉత్పత్తులకు సంబంధించి ఎంత ఫ్రీ కమర్షియల్ టైమ్ ఇస్తారన్నది కూడా స్పాన్సర్లు చూస్తారని అంటున్నారు. ఈ కారణాల చేతనే ఐపీఎల్, ఐసీఎల్తో పోలిస్తే ప్రో కబడ్డీకి తక్కువ ఆదాయం వస్తుంది.