ముంబై : బంగారం ధర పరుగులు పెడుతోంది. పది గ్రాముల పసిడి ధర 38 వేల మార్క్ను దాటి 39,000 మార్క్ దిశగా పయనిస్తోంది. శుక్రవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.475 పెరిగి రూ.38,420కు చేరింది. దేశీయంగా కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర పెరిగిందని ఆల్ ఇండియా సరఫ అసోసియేషన్ పేర్కొంది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి ధర రూ.378 పెరిగి రూ.44,688 వద్దకు చేరింది.
దీపావళికి రూ.40 వేలకు చేరవచ్చు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించడం, చైనా, -యుఎస్ మధ్య వాణిజ్య యుద్ధం, అమెరికా మార్కెట్లలో ప్రతికూల దీర్ఘకాలిక బాండ్ ఈల్డ్ వెరసి అంతర్జాతీయంగా బంగారం ధర పెరుగుతోంది. దీపావళి నాటికి దేశీయంగా బంగారం ధరలు 10 గ్రాములు 39,000 నుండి 40,000 రూపాయలకు చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్సుకు 1,560 నుండి 1,580 వరకు చేరవచ్చని వారు అభిప్రాయపడ్డారు.
పెరుగుదలకు కారణాలు
గత పది సంవత్సరాలుగా అమెరికా మార్కెట్లలో బాండ్ ఈల్డ్ ప్రతికూలంగా ఉంది. ఈ కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే భవిష్యత్తులో వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తుందనే సంకేతాలు ఉండడం. చైనా-, అమెరికా వాణిజ్య ఉద్రిక్తత.. ఇది ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలకు ఆజ్యం పోసింది.