జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం, లోయలో కమ్యూనికేషన్ మొత్తం నిలిచిపోవడంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. పిటిషనర్ల వాదలు విన్న సుప్రీం కోర్టు.. జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రానికి మరింత సమయం ఇద్దామని చెప్పింది. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ అన్నారు. కశ్మీర్ టైమ్స్ వేసిన పిటిషన్ ను కొట్టేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందన్నది భద్రతా దళాలకు తెలుసని అన్నారు. కనీసం ల్యాండ్ లైన్లు అయినా పని చేసేలా చూడాలని పిటిషనర్ వాదించారు. మొత్తం వాదనలు విన్న చీఫ్ జస్టిస్ గతంలో చెప్పినట్లే… ప్రభుత్వానికి మరికొంత సమయం ఇద్దామని సూచించారు. మరోవైపు సీనియర్ అడ్వొకేట్ ML శర్మ వేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు. అరగంట నుంచి పిటిషన్ లో ఏముందని చదువుతున్నా… ఏదీ అర్థం కాకుండా తీసుకొచ్చారని జస్టిస్ రంజన్ గొగొయ్ అన్నారు.