ఇండోనేషియా రాజధాని మారనుంది. తరచూ భూకంపాలు, సునామీల బారిన పడుతున్న జకార్తాను రాజధానిగా కొనసాగించడం సరికాదనే భావానలో ఇండోనేషియా ఉంది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆ దేశ పార్లమెంట్ లో రాజధాని మార్పు గురించి ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన అధ్యక్షుడు బోర్నియో ద్వీపంలోని కాళీమంథన్ ప్రాంతానికి రాజధానిని తరలించనున్నామని తెలిపారు. జకార్తా ఏటా 25 సెంటీమీటర్ల మేర సముద్రంలో మునిగిపోతోంది. ఇలాగే కొనసాగితే 2050నాటికి నగరంలో మూడింట ఒక వంతు భూభాగం సముద్రంలో కలిసిపోవడం ఖాయమని నిపుణులు హెచ్చరించారు. దీంతో రాజధాని మార్చాలని ఇండోనేషియా నిర్ణయించింది.