కాబూల్లో ఓ పెళ్లి వేడుకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో శనివారం రాత్రి బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో 40 మంది చనిపోయారు. 100 మంది గాయపడ్డారు. బాంబు పేలిన సమయంలో వేడుకలో సుమారు వెయ్యి మంది ఉన్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పెళ్లి వేడుకకు వచ్చిన వారు గుంపుగా ఉన్న సమయంలో దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. మృతుల సంఖ్యపై అధికారులు అధికారిక ప్రకటన చేయలేదు. ఈ దాడికి పాల్పడినట్టు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. తాలిబన్లు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అఫ్గాన్ లో అమెరికా సైనికులకు, తాలిబన్లకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ బాంబు దాడి జరగడం గమనార్హం. ఈ నెలలో రెండు సార్లు బాంబు దాడులు జరిగాయి. ఆగస్టు 7న పోలీసులను టార్గెట్ గా చేసుకుని తాలిబన్లు దాడి చేయడంతో 14 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అఫ్గాన్ వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.