ఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ పది రోజుల క్రితం ఆయన ఎయిమ్స్ లో చేరారు. అయితే రోజురోజుకు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పని చేయడం లేదని, గుండె పనితీరు కూడా మందగించిందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనకు ఇసిఎంఒను అమర్చి, ఐసియులో చికిత్స అందిస్తున్నారు. జైట్లీ తానంతట తాను శ్వాస తీసుకోలేకపోతున్నారని, ఈ క్రమంలోనే ఈ పద్ధతి ద్వారా చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. కిడ్నీలు పని చేయకపోవడం, గుండ పనితీరు మందగించడం వంటి కారణాల వల్ల శ్వాస సమస్యలు వచ్చిన సమయంలో ఇసిఎంఒను అమర్చుతారని వైద్యులు వెల్లడించారు. జైట్లీ ఇప్పడు లైఫ్ సపోర్టు సిస్టమ్ పై ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జైట్లీని పరామర్శించేందుకు బిజెపి నేతలు ఎయిమ్స్ కు క్యూకడుతున్నారు. అయితే జైట్లీని పరామర్శించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని వైద్యులు స్పష్టం చేశారు. జైట్లీ కోలుకోవాలని బిజెపి నేతలు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు.