తిరుమల: తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ వారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు పండితులు వేదాశీర్వచనం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. నిర్మలాసీతారామన్ వెంట వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి, బిజెపి నేత భానుప్రకాశ్రెడ్డి తదితరులు ఉన్నారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా నిర్మలాసీతారామన్ తెలిపారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు ఆమె వెల్లడించారు.