బెంగళూరు: ఈ నెల 20వ తేదీన కర్నాటక మంత్రిమండలి విస్తరణ జరగనుంది. 22 రోజులుగా కేబినెట్ లేకుండానే సిఎం గా తానొక్కడిగానే యడియూరప్ప బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వివిధ కారణాలతో ఇప్పటివరకూ మంత్రుల నియామకం వాయిదా పడుతూ వచ్చింది. మంత్రులను తీసుకుని మంత్రివర్గ ఏర్పాటుకు ముఖ్యమంత్రి యడియూరప్పకు బిజెపి అధ్యక్షులు అమిత్ షా నుంచి ఎట్టకేలకు అనుమతి వచ్చింది. దీనితో మంగళవారం ఉదయం పది గంటలకు విదాన సౌధలోని కాన్ఫరెన్స్ హాల్లో బిజెపి లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి శనివారం ఒక ట్వీట్లో తెలిపారు. అదే రోజు కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా వెల్లడించారు. రాష్ట్రంలో వరద పరిస్థితి, డ్యాంలకు భారీ స్థాయిలో నీరు రావడంతో తలెత్తిన ముప్పు, వరద నష్టానికి కేంద్రసాయం వంటి అంశాలపై చర్చించేందుకు గురువారం సిఎం ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగానే మంత్రుల నియామకం గురించి అమిత్ షాతో ఇతర నేతలతో చర్చించినట్లు, తగు హామీతో బెంగళూరుకు వచ్చినట్లు వెల్లడైంది.