చెలరేగిన పుజారా...తొలి రోజు ఆట 297/5

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 02:38 PM

చెలరేగిన పుజారా...తొలి రోజు ఆట 297/5

వెస్టిండీస్-ఎ జట్టుతో ఆంటిగ్వా వేదికగా శనివారం రాత్రి (విండీస్ టైమింగ్స్‌) ఆరంభమైన మూడు రోజుల ప్రాక్టీస్‌ టెస్టు మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా చెలరేగిపోయాడు. పుజారా (100 రిటైర్ట్ హర్ట్: 187 బంతుల్లో 8x4, 1x6) శతకం బాదడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 297/5తో నిలిచింది. పుజారాతో పాటు రోహిత్ శర్మ (68: 115 బంతుల్లో 8x4, 1x6) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. విరాట్ కోహ్లీ స్థానంలో కెప్టెన్‌గా జట్టుని నడిపించిన అజింక్య రహానె (1) నిరాశపరిచాడు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ చేతి వేలికి గాయమవడంతో.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడటం లేదు. వెస్టిండీస్ ప్రధాన జట్టుతో గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్‌ని టీమిండియా ఆడనుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. మయాంక్ అగర్వాల్ (12: 28 బంతుల్లో 2x4)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కేఎల్ రాహుల్ (36: 46 బంతుల్లో 5x4, 1x6) తొలి వికెట్‌కి 36 పరుగుల భాగస్వామ్యం మాత్రమే నెలకొల్పాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లోనే మయాంక్ ఔటవగా.. 14వ ఓవర్‌లో రాహుల్ పెవిలియన్‌కి చేరిపోయాడు. అయితే.. ఆ తర్వాత వచ్చిన చతేశ్వర్ పుజారా నిలకడగా ఆడినా.. రహానె తేలిపోయాడు. దీంతో.. 53/3తో భారత్ నిలిచిన దశలో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన పుజారా.. నాలుగో వికెట్‌కి అభేద్యంగా 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సెంచరీ తర్వాత పుజారా రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరగగా.. హాఫ్ సెంచరీ తర్వాత రోహిత్ శర్మ ఔటైపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి (37 నాటౌట్: 101 బంతుల్లో 2x4) ఓపికగా క్రీజులో నిలవగా.. రిషబ్ పంత్ (33: 53 బంతుల్లో 4x4, 1x6) మరోసారి దూకుడుగా ఆడే ప్రయత్నంలో పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో.. ప్రస్తుతం క్రీజులో విహారితో పాటు రవీంద్ర జడేజా (1 నాటౌట్) ఉన్నారు.





Untitled Document
Advertisements