అర్జున అవార్డుకి సాయి ప్రణీత్ నామినేట్

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 02:40 PM

అర్జున అవార్డుకి సాయి ప్రణీత్ నామినేట్

భారత స్టార్ బ్యాడ్మింటన్ సాయి ప్రణీత్ ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకి నామినేట్ అయ్యాడు. స్విట్జర్లాండ్ వేదికగా సోమవారం నుంచి బీడబ్ల్యూ‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మొదలవనుండగా.. ఈ టోర్నోకి రెండు రోజుల ముందు అర్జున అవార్డుకి నామినేట్ అవడం ప్రణీత్‌లో ఉత్సాహం నింపే వార్తే. దిగ్గజ కోచ్ పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన సాయి ప్రణీత్.. 2017 నుంచి సంచలన ప్రదర్శనలకి మారుపేరుగా నిలుస్తూ వస్తున్నాడు. రెండేళ్ల క్రితం సింగపూర్ ఫైనల్‌లో కిదాంబి శ్రీకాంత్‌ని ఓడించి మరీ టైటిల్ గెలిచిన ప్రణీత్.. ఆ తర్వాత రెండు గ్రాండ్ ఫ్రిక్స్ గోల్డ్ టైటిల్స్ గెలిచాడు. దీంతో.. 2018లోనే అతనికి అర్జున వస్తుందని అంతా ఊహించారు. అయితే.. గత ఏడాది అతను కనీసం నామినేట్ కూడా అవలేదు. అర్జున అవార్డుకి తాజాగా నామినేట్ అవడంపై సాయి ప్రణీత్ మాట్లాడుతూ ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి రెండు రోజుల ముందు అర్జునకి నామినేట్ అవడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దేశానికి మరిన్ని పతకాలు అందించేలా ఈ నామినేషన్ నాలో స్ఫూర్తి నింపనుంది. వాస్తవానికి 2018లోనే ఈ అవార్డు వస్తుందని నేను ఆశించాను. ఎందుకంటే ఇప్పటి వరకూ నా కెరీర్‌లోనే 2017 అత్యుత్తమ దశ. ఏది ఏమైనా.. ఇదో గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ అవార్డు కోసం గత మూడేళ్లుగా నిరీక్షించా. అర్జున అవార్డు గ్రహీత అని పిలిపించుకోవడం సంతోషంగా ఉంటుంది. క్రీడాకారులకి ఇదో గుర్తింపు’ అని వెల్లడించాడు.





Untitled Document
Advertisements