హైదరాబాద్: అప్పుడే పుట్టిన ఆడశిశువు మృతదేహాన్ని పొలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన నగరంలోని మీర్పేట్ పొలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రాఘవేందర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… కర్మన్ఘాట్లోని నందనవనం అల్ప ఆదాయ వర్గాల గృహ సముదాయాల్లో గల బ్లాక్ నెం:76 వెనుక వైపు నుంచి గురువారం ఉదయం కొర్ర బాలు అనే యువకుడు నడుచుకుంటూ వస్తుండగా మూట మాదిరిగా చుట్టి, రక్తపు మరకలు అంటుకొని ఉన్న ఓ ప్లాస్టిక్ కవర్ చూశాడు. దీంతో అనుమానం వచ్చిన కవర్ను తెరిచి చూడగా అందులో సుమారు 4 నుండి 5 గంటల క్రితం మాత్రమే పుట్టిన ఆడశిశువు మృతదేహాం కనిపించింది.
అనంతరం బాలు వెంటనే మీర్పేట్ పొలీసులకు సమాచారాన్ని అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా.. సంఘటన స్థలం చుట్టుపక్కల సిసి కెమెరాలు లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటారని, వారి ఆచూకి గుర్తించేందకు తమకు ఇంకా ఆధారాలు లభ్యం కాలేదని, అక్రమ సంభంధం లేక ఆడపిల్ల పుట్టిందన్న కారణాలతోనే ఎవరో పాపను పురిటిలోనే చంపేసి ప్టాస్టిక్ కవర్లో చుట్టి ఇక్కడ పడవేసి ఉంటారన్న పొలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పోస్ట్మార్టం రిపోర్ట్ ఆధారంగా నిందితులను గుర్తిస్తామని ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు.