చెన్నై: రాష్ట్రంలోకి ఉగ్రవాదులు చొరబడినట్లు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న తమిళనాడు ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పాకిస్థాన్ లోని లష్కరే తోయిబాకు చెందిన 6గురు ఉగ్రవాదులు.. శ్రీలంక మీదుగా తమిళనాడులోకి ప్రవేశించి కోయంబత్తూరులో దాగి ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో పోలీసులు చెన్నై, కోయంబత్తూర్ సహా పలు ముఖ్య పట్టణాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని అన్ని వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు.
రాష్ట్రంలోకి చొరబడ్డ ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తానీ కాగా.. మరో ఐదుగురు శ్రీలంక ముస్లింలుగా నిఘా వర్గాలు తెలిపాయి. తాజా హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్స్, బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, షాపింగ్ మాల్స్ లతోపాటు పలు రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.