సంచలన ప్రకటనలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 07:38 PM

సంచలన ప్రకటనలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి

దేశ ఆర్థిక పరిస్థితిగతుల గురించి తెలియజేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు మీడియాతో సమావేశం నిర్వహించారు. దేశ ఆర్థిక వృద్ధి రేటును పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్రకటన చేయొచ్చనే అంచనాల నడుమ నిర్మలా సీతారామన్ ఇప్పుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచ వృద్ధి రేటు 3.2 శాతం. ఇది తగ్గే అవకాశముంది. చాలా సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ బలహీనంగా ఉందని పేర్కొంటున్నాయి. అమెరికా, జర్మనీ దేశాలు రివర్స్ కర్వ్వ్‌ను చూశాయి. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, చైనా కరెన్సీ వ్యాల్యూ పడిపోవడంతో ప్రపంచ దేశాలపై ప్రభావం పడింది. భారత్ వృద్ధి రేటు అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంది. ప్రధాని మోదీ ఏం చెప్పారో అదే విషయాన్ని మళ్లీ మీకు తెలియజేయాలని భావిస్తున్నా. సంపద సృష్టించే వారిని గౌరవిస్తాం. బడ్జెట్ ప్రతిపాదనలపై పరిశ్రమ సంబంధిత నిపుణులతో లోతుగా చర్చిస్తాం. 2014 నుంచి సంస్కరణలు కొనసాగిస్తూ వస్తున్నాం. సంస్కరణలు అనేవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. వీటి వల్ల వ్యాపార నిర్వహణ సులభతరమౌతుంది. సంస్కరణలకు కొనసాగిస్తాం. పన్ను సంస్కరణలకు కట్టుబడి ఉన్నాం. ట్యాక్స్ రిటర్న్స్ ప్రక్రియను సరళతరం చేస్తాం. పన్ను వేధింపులకు తావివ్వం. వ్యవస్థలతో ఆడుకునే వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి. తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇంటి కొనుగోలుదారులు, ఎంఎస్ఎంఈలు ప్రయోజనం పొందాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిబంధనల ఉల్లంఘనలను క్రిమినల్ నేరాలుగా భావించం. ఇప్పడు ఐటీ సమన్లు సెంట్రలైజ్‌డ్ సిస్టమ్ నుంచి వెళ్తాయి. దీంతో అసెసీలకు వేధింపులు ఉండవు. ఇప్పటి వరకు జారీ అయిన పాత నోటీసులన్నీ నెలన్నర రోజుల్లోగా పరిష్కారమౌతాయి. ఎఫ్‌పీఐలపై సర్‌చార్జ్ పెంపును వెనక్కు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎఫ్‌పీఐలపై సర్‌చార్జ్ పెంచిన విషయం తెలిసిందే. ఆర్‌బీఐ రేట్ల కోత ప్రయోజనాలు బ్యాంక్ కస్టమర్లకు బదిలీ అవుతాయి. దీంతో హోమ్ లోన్స్, వాహన రుణాలు చౌక వడ్డీకే లభిస్తాయి. బ్యాంకులు రెపో లింక్డ్ రుణాలు అందిస్తాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు లోన్ క్లోజ్ అయిన తర్వాత 15 రోజుల్లోనే లోన్ డాక్యుమెంట్లను కస్టమర్లకు అందిస్తాయి. ఎన్‌బీఎఫ్‌సీలు ఆధార్ ఆధారిత కేవైసీ విధానాన్ని వినియోగించుకోవచ్చు. ఎంఎస్ఎంఈ రుణాలకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పాలసీ తీసుకువస్తాం. ప్రభుత్వ బ్యాంకులకు రూ.70,000 కోట్ల మూలధనాన్ని అందిస్తాం. డీపీఐఐటీ కింద నమోదైన స్టార్టప్స్‌కు ఏంజెల్ ట్యాక్స్ ఉండదు. జీఎస్‌టీ వ్యవస్థను మరింత సరళంగా మారుస్తాం. వినియోగం మందగించడం కేవలం భారత్‌కే పరిమితం కాదు. ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎంఎస్ఎంఈలకు పెండింగ్‌లోని జీఎస్‌టీ రిఫండ్స్‌ను 30 రోజుల్లోగా క్లియర్ చేస్తాం.





Untitled Document
Advertisements