ఆర్సీబీకి కొత్త కోచ్

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 08:02 PM

ఆర్సీబీకి కొత్త కోచ్

వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పటినుంచే జట్టులో కీలక మార్పులు చేసుకుంటున్నారు. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హెడ్‌ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కలమ్‌ ఎంపికగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా హెడ్‌ కోచ్‌గా ట్రెవర్ బేలిస్, అసిస్టెంట్ కోచ్‌గా బ్రాడ్ హడిన్‌ని నియమించిన విషయం తెలిసిందే. తాజాగా అదే బాటలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కూడా అడుగులు వేసింది. ఐపీఎల్ 2019 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో కనీసం ప్లేఆఫ్‌కి కూడా బెంగళూరు టీమ్ అర్హత సాధించలేకపోయింది. దీంతో.. హెడ్ కోచ్‌ గ్యారీ కిరిస్టన్‌పై గుర్రగా ఉన్న ఫ్రాంఛైజీ.. తాజాగా అతడ్ని తప్పించి సైమన్ కటిచ్‌ని టీమ్ ప్రధాన కోచ్‌గా నియమించింది. కటిచ్‌తో పాటు మైక్ హసన్‌ని కూడా జట్టులో భాగస్వామ్యం చేసిన ఫ్రాంఛైజీ.. అతడికి క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌ పదవిని కట్టబెట్టింది. ఇటీవల టీమిండియా హెడ్‌ కోచ్ పదవి కోసం రవిశాస్త్రి‌తో పోటీపడిన హసన్.. రెండో స్థానానికి పరిమితమైన విషయం తెలిసిందే. బెంగళూరు టీమ్‌లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, విధ్వంసక హిట్టర్ ఏబీ డివిలియర్స్‌ ఉన్నా.. పాయింట్ల పట్టికలో ఆ జట్టు స్థానం ఎప్పుడూ దిగువనే. గత ఏడాది ఐపీఎల్‌లో అయితే ఆ జట్టు ప్రదర్శన మరీ తీసికట్టుగా కనిపించింది. ఎంతలా అంటే.. సగం సీజన్ ముగిసే వరకూ ఆ జట్టు ఆఖరి స్థానంలోనే ఉంది.





Untitled Document
Advertisements