శ్రీ కృష్ణుడు పాలించిన ద్వారకా నగరానికి ఏమైంది? ఎందుకు మునిగిపోయింది?

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 09:08 PM

శ్రీ కృష్ణుడు పాలించిన ద్వారకా నగరానికి ఏమైంది? ఎందుకు మునిగిపోయింది?

ద్వారకా నగరం గురించి తెలిసే ఉంటుంది కదా. సముద్రం అడుగున ఉన్న్న ఈ నగరాన్ని మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించాడు. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. అయితే ఈ నగరానికి ఏమైంది? సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? అనే పూర్తి వివరాలను ఈ రోజు కృష్ణాష్టమి కదా ఈ పర్వదినాన్ని పురష్కరించుకొని తెలుసుకుందాం. అసలు విషయంలోకి వెళ్తే....హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు ధామాల(చార్‌ధామ్)లో ద్వారక ఒకటి. ద్వారకా అనేక ద్వారాలు కలది అని అర్థం. వేద వ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్‌లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. దీంతో మగధరాజైన జరాసంధుడి మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అంధకులు, వృష్టులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను ‘దశరాస్’ అంటారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు.. ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు. గోమతీ నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. నిర్వహణా సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలు చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారక నిర్మితమైంది. రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ. ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. అందమైన కట్టడాలతోనే కాదు.. ప్రకృతి సోయగాలో నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్రగర్భంలో కలిసి పోయింది. మహాభారత యుద్ధం క్రీ.పూ. 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనైమనట్లు చెబుతారు. యాదవకులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. అయితే, ఒక బోయవాడి ( పూర్వజన్మలో వాలి) బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలలో ఉంది. శ్రీకృష్ణుడు 120 ఏళ్లు జీవించినట్ల చరిత్ర చెబుతోంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని సమాచారం. ఆ రోజు సముద్రుడు ఉవ్వెతున్న ఎగసిపడటం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గమనార్హం. ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారాకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిపోనుందని తెలిపాడు. ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు.. శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజలు, అర్జునుడు కళ్ల ముందే జరిగింది. ద్వారకాపురి క్రీ.పూ. 1443లో సాగర గర్భంలో మునిపోయినట్లు చరిత్రకారలు చెబుతున్నారు. ఈ మేరకు పలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ సముద్రతీరంలో ఆనవాళ్లు లభించాయి. 1983-86లో గుజరాత్ సముద్రతీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ ఎస్.ఆర్. రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో.. ద్వారకా నగరం క్రీ.పూ. 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కి.మీ. దూరంలో సముద్ర గర్భంలో 40 మీ. లోతులో సుమారు 9 చ.కి.మీ. వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫొటోలను విడుదల చేశారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి.





Untitled Document
Advertisements