జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకోవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్కు చెందిన ఇతర నాయకులు సైతం నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే చాలామంది చూపు మాత్రం రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్పైనే నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న రేవంత్ రెడ్డి నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే పోరాటం మొదలుపెట్టారు.
తాజాగా పవన్ కళ్యాణ్ సైతం ఈ అంశంపై సీరియస్గా దృష్టి పెట్టడంతో... ఈ అంశంపై ఇద్దరు కలిసి పోరాటం చేస్తారా అనే అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి కలిసి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే... అది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రజల్లో రాజకీయంగా తన ఉనికిని చాటుకోవాలని భావిస్తున్న జనసేన సైతం... ఇందుకోసం నల్లమలలో యురేనియం తవ్వకాల అంశంపై పోరాటం చేయడం సరైన మార్గమని భావిస్తోంది. ఈ కారణంగానే ఈ అంశంపై ఆ పార్టీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది