కోడెల శివప్రసాద రావు మృతికి ప్రభుత్వ వేధింపులే కారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్మాదిలా వ్యవహరిస్తోందని... కోడెల మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. కోడెలలాంటి వ్యక్తికి ఇలాంటి ముగింపు రావడం చింతించదగ్గ విషయమన్నారు. కేసులు,ఆరోపణలు, వేధింపులతో కోడెల కుటుంబాన్ని చెల్లాచెదురుచేశారని.. కోడెల తప్పు చేసి చనిపోలేదు, వేధింపులకు గురై చనిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఓ సీనియర్ నేత ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి అని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రూ.43వేల కోట్లు దోచుకుని, లక్ష రూపాయాల ఫర్నీచర్ కోసం కోడెల మీద కేసు పెడతారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు.. ఆలిండియా సర్వీస్ ఉద్యోగులు సరెండర్ అయ్యారని చంద్రబాబు ఆరోపించారు.డీజీపీని సంప్రదించినా తన వల్ల కాదని తిప్పి పంపారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
వైసీపీ ప్రభుత్వం కోడెలను శారీరకంగా..మానసికంగా.. ఆర్థికంగా వేధించి చంపిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.కుమారుడు, కూతురు వేధింపుల వల్లే... కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు వాపోయారు. శివరాం విదేశాల్లో కాకుండా ఇక్కడే ఉండుంటే... కోడెలను ఆయనే చంపాడని కేసులు పెట్టేవారని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీది టెర్రరిస్టు ప్రభుత్వమే కాదని... అంతకంటే ఎక్కువ అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
తన ఇంట్లోని ఫర్నిచర్ తీసుకెళ్లాలని...అసెంబ్లీ కార్యదర్శికి కోడెల నాలుగు లేఖలు రాశారన్నారు.కానీ అసెంబ్లీ కార్యదర్శి కనీసం స్పందించలేదన్నారు.వైసీపీ ప్రభుత్వం ఉన్మాదిలా వ్యవహరిస్తోందని... కోడెల మృతిపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.