తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్గా, తొలి మహిళా గవర్నర్గా ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు చేరువయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాజ్భవన్ వేదికగా ప్రజల నుంచి ఆమె విజ్ఞప్తులు స్వీకరించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లాఖాన్.. గవర్నర్కు లేఖ రాశారు.. సీఎం కేసీఆర్ సామాన్య ప్రజలను కలవడంలేదని.. సామాన్య ప్రజల సమస్యలను వినిపించుకోవడంలేదని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీఎం కేసీఆర్.. సామాన్య ప్రజలను కలిసిన దాఖలాలువేవన్న ఆయన.. సచివాలయానికి కూడా రావడం లేదని.. అందుకే రాజ్భవన్లో ప్రజాదర్బార్ నిర్వహించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. వారానికి ఓసారి రాజ్భవన్ వేదికగా ప్రజాదర్బార్ నిర్వహించాలని కోరారు. అయితే దీనికి వెంటనే స్పందించారు గవర్నర్ తమిళిసై.. మీ ప్రతిపాదనకు నా ధన్యవాదాలు. ఈ విషయం నా దృష్టిలో కూడా ఎప్పటి నుంచో పరిశీలనలో ఉంది.. అంటూ రిప్లే ఇచ్చారు. దీంతో త్వరలోనే ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని తెలుస్తోంది. రాజ్భవన్ వేదికగా ప్రజా దర్భార్ నిర్వహిస్తే ఇది కేసీఆర్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే.. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సీఎం.. దూరం కావడంతో.. గవర్నర్ రంగంలోకి దిగారనే అపవాదు ముఖ్యమంత్రి మీద పడడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.