మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. కోడెల ఆత్మహత్యకు కారణం అధికార వ్యవస్థ భ్రష్టు పట్టడమేనని ఆరోపించారు. ఏపీలో అధికార వ్యవస్థలన్నీ అవినీతిమయంగా మారాయని అన్నారు. ప్రభుత్వ అధినేతలకు ఉద్యోగులు తొత్తులుగా మారుతున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన బోటు ప్రమాద ఘటనపై ఆయన మాట్లాడుతూ, గోదావరిలోకి ప్రైవేట్ బోట్లను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ పాలనపై పట్టు కోల్పోయారని విమర్శించారు. బోట్ టూరిజంపై ఎయిర్ పోర్ట్ తరహాలో విధానాన్ని ప్రవేశపెట్టాలని, అప్పటివరకూ రాష్ట్రంలో బోట్లన్నింటినీ ఆపివేయాలని సూచించారు.