రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవడంతో పట్టణీకరణ పెరిగిపోతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పట్టణ పేదలకు మంచి చేయాలన్న లక్ష్యంతో కొత్త మున్సిపాలిటీ చట్టం తెస్తున్నట్టు ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో తక్షణమే భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే విధానాన్ని తెచ్చామన్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా తెలంగాణలో 100 శాతం ఒడిఎఫ్ లు సాధించుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధిలో హరితహారాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని కెటిఆర్ చెప్పారు. మున్సిపాలిటీల్లో ఎల్ఇడి లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ను ఆదా చేస్తున్నామని ఆయన తెలిపారు. పట్టణాల్లో రహదారులు నిర్మిస్తున్నామని, హైదరాబాద్ లో మున్సిపల్ బాండ్లు తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. . హైదరాబాద్లో నిర్మాణాల వ్యర్థాల రీసైక్లింగ్కు రెండు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా జవహార్నగర్ డంపింగ్ యార్డు క్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ తో పాటు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు.