భారత యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తనకు విరాట్ కోహ్లి ఆదర్శమని, కోహ్లి నుంచి నిబద్ధత, ఆలోచన విధానాన్ని అలవర్చుకున్నానని తెలిపాడు. గ్రౌండ్లో దిగినప్పుడూ పరిస్థితులు ఎలా అర్థం చేసుకోవాలి తనకు కోహ్లి వివరించాడన్నాడు. అతనితో కలిసి ఆడడం మరుపులేని జ్ఞాపకం ఇచ్చిందన్నాడు. రానున్న టెస్టు సిరీస్లో నిలకడగా రాణించడమే లక్షంగా పెట్టుకున్నానన్నాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమన్నాడు. జట్టులో చోటు దక్కడం అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని తెలిపాడు. విండీస్ సిరీస్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, సీనియర్లు రహానె, కోహ్లి ఈ సందర్భంగా అందించిన సలహాలు, సూచనలు ఎప్పటికీ గుర్తుంటాయన్నాడు. నిలకడైన ఆటతో జట్టుకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తానని వివరించాడు. దక్షిణాఫ్రికా సిరీస్ కోసం పూర్తిగా సిద్ధమయ్యానని తెలిపాడు. బలమైన జట్టుపై రాణిస్తే ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని మయాంక్ పేర్కొన్నాడు.