చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు షట్లర్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అశ్వినీ పొన్నప్పతో కలిసి చెలరేగాడు. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలిరౌండ్లో సాత్విక్-అశ్విని జంట 22-20, 17-21, 21-17తో ఇండోనేసియాకు చెందిన ప్రపంచ ఏడో ర్యాంకర్ జోడీ ప్రవీణ్ జోర్డాన్-మెలాటి దియేవాను చిత్తుచేసింది. సాత్విక్ జోడీ రెండోరౌండ్లో జపాన్కు చెందిన యుకీ కనెకో- మిసాకి మట్సుటుమో జంటతో తలపడనుంది. మిక్స్డ్లో అద్భుత విజయాన్నందుకున్న సాత్విక్ సాయిరాజ్ డబుల్స్లోనూ శుభారంభం చేశాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్ షెట్టి జోడీ 21-7, 21-18తో కెనడా ద్వయం జాసన్ ఆంథోనీ-నిల్ యకురను వరుససెట్లలో ఓడించి రెండోరౌండ్ చేరింది. సింగిల్స్ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్ బుధవారం తమ పోరును ప్రారంభించనున్నారు. ఓన్గారున్పాన్ (థాయ్లాండ్)తో ఎనిమిదో సీడ్ సైనా, జురుయ్ లీ (చైనా)తో ఐదో సీడ్ సింధు, అవిహిన్గ్సాన్ (థాయ్లాండ్)తో సాయి ప్రణీత్, లెవర్జ్ (ఫ్రాన్స్)తో కశ్యప్ తొలిరౌండ్ ఆడనున్నారు.