ఢిల్లీ: భారత రాజధాని ఢిల్లీలో ఉల్లిపాయ ధరలు నింగికెగిశాయి. దీంతో ఉల్లిని కోయకుండానే కళ్ల వెంట నీరొస్తోంది అని ఢిల్లీ జనాలు వాపోతున్నారు. భారీ వర్షాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో, ఈ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోని రీటెయిల్ మార్కెట్ కు ఉల్లిపాయ సరఫరా చాలా వరకు తగ్గిపోయింది. 10 రోజుల క్రితం వరకు కిలో ఉల్లిపాయ ధర రూ. 25 నుంచి రూ. 30 వరకు ఉండగా... ఇప్పుడు కిలో ధర రూ. 60కి పెరిగింది. డిమాండ్ కంటే సరఫరా తక్కువగా ఉండటంతో... ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయని ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు.