టీడీపీ పార్టీ కీలక నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే.ఆయన మరణం అటు తెలుగుదేశం పార్టీలోనూ,ఇటు కోడెల కుటుంబంలోనూ పెను విషాదాన్ని మిగిల్చింది. ఊహించని ఈ హఠాత్పరిణామంతో తెలుగు రాష్ట్రాలు షాక్ కు గురయ్యాయి.
కోడెల శివప్రసాద్ మరణంతో టీడీపీ పార్టీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయనపై పెట్టిన కేసుల వల్లే ఆయన మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని మండిపడుతున్నారు. కోడెల మరణానికి నైతిక బాధ్యత వైసిపి నేతలే వహించాలని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం వలనే కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు.చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే, కేసులతో ఇబ్బంది పడుతున్న కోడెల ను చంద్రబాబు అవమానించడం వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా కోడెల కుమార్తె విజయలక్ష్మి ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.రాజకీయ వేధింపులే తన తండ్రి మరణానికి కారణమని భావించి కోడెల కుమార్తె విజయ లక్ష్మి జగన్ ప్రభుత్వం వలనే తన తండ్రి చనిపోయారని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సమాచారం.కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే తన తండ్రి మరియు సోదరులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేసారని అందువల్లే తన తండ్రి చనిపోయారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. కావున జగన్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రి మరణానికి కారణం అయిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోపక్క తెలంగాణా పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తులో ఆయన ఆత్మహత్య చేసుకోవటం వల్లే మృతి చెందారని పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది .