చల్లటి గాలికి తన నాలుగేళ్ల చిన్నారితో కలిసి ఓ తల్లి ఆరుబయటే నిద్రపోయింది. అయితే దీన్ని గమనించిన ఓ కిడ్నాపర్ పాపను ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ వేశాడు. చల్లగా వచ్చి చిన్నారిని తన ట్రై సైకిల్ లో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే మేలుకున్న తల్లి ఒక్క ఉదుటన తన పాపను దగ్గరకు తీసుకుంది. దీంతో కిడ్నాపర్ ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. ఈ ఘటన పంజాబ్ లోని లూథియానాలో చోటుచేసుకుంది.
లూథియానాలో ఓ చిన్నారి తన అమ్మ, నానమ్మతో కలిసి ఆరు బయట నిద్రపోతుండగా, అదే ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి పాపను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బాలిక తల్లి ఒక్కసారిగా మేల్కొని గట్టిగా అరవడంతో అతను ఘటనాస్థలం నుంచి ట్రై-సైకిల్ పై పరారయ్యాడు. అయితే స్థానికులు అతడిని కొద్దిదూరంలోనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు పాపను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నాడో ఇంకా తెలియరాలేదని చెప్పారు. బాధిత కుటుంబం ఫిర్యాదు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సదరు నిందితుడిపై కేసు నమోదుచేశామన్నారు. త్వరలోనే అతడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలిస్తామని పేర్కొన్నారు.