ఆమె పారిశుధ్య కార్మికులు. 55 ఏళ్లు ఉంటాయేమో. 18 ఏళ్లుగా పనిచేస్తోంది. తన వేదననంతా ఓ వీడియోలో రికార్డు చేసింది. అయితే తన గురించి కాదు.. సమాజం గురించే! ‘అయ్యా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం వేయకండి.. మురికి నీళ్లు వదలకండి.. మీ పిల్లల ఆరోగ్యాలను పాడు చేయకండి’ అని వేడుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజలకు స్వచ్ఛత ఆవశ్యకతపై గట్టి సందేశాన్నిచ్చింది.
రాజేంద్రనగర్ సర్కిల్లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న బాబమ్మ (54)దీ ఆదర్శం! ఆమె వీడియో సందేశాన్ని స్వచ్ఛ హైదరాబాద్ ట్విటర్ ఖాతాలో ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. కొన్నిగంటల్లోనే ఇది వైరల్గా మారింది. ‘మేం ఊడ్చేది ఊడుస్తనే ఉన్నం. ఎత్తేది ఎత్తుతనే ఉన్నం. అయినా రోడ్ల మీద చెత్త ఇసురుకుంట పోతున్నరు. చెత్తను బండికాడన్న ఎయ్యండి.. డబ్బాలన్న ఎయ్యండని చెప్పినా ఇంటలేరు నల్లా నీళ్లు, ఇండ్లు కడిగిన నీళ్లను రోడ్ల మీద. వదులుతున్నరు. ఆ నీళ్లపై ఈగలు, దోమలు వాలి పిల్లలకు డెంగీ, మలేరియా, జ్వరాలు వస్తున్నయి. దయచేసి మీ పిల్లలను కాపాడుకునేందుకైనా జాగ్రత్తగా ఉండండి సర్. సమస్కారం’ అని బాబమ్మ పేర్కొంది.