భారత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) పావు శాతం మేరకు వడ్డీ రేటును తగ్గించింది. అయినప్పటి మార్కెట్లు సంతృప్తి చెందలేదు. దీంతో స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు 0.4 శాతం కోతను అంచనా వేయగా, ఆర్బిఐ 0.25 శాతమే వడ్డీ రేటును తగ్గించింది. ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ నుంచి నిర్ణయాలు వెలువడిన వెంటనే మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఉదయం నుంచి ఉత్సాహంగా పరుగులు తీస్తున్న సూచీలు ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. మార్కెట్లు లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 434 పాయింట్లు పతనమై 37,673 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 139 పాయింట్లు కోల్పోయి 11,175 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 37,633 వద్ద, నిఫ్టీ 11,388 వద్ద కనిష్టాలను చవిచూశాయి. ఎన్ఎస్ఇలో అన్ని రంగాలూ బలహీనపడగా.. మీడియా, బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఎంసిజి, మెటల్, రియల్టీ క్షీణించాయి. ఐటీ మాత్రం 0.4 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో జి, గ్రాసిమ్, అల్ట్రాటెక్, జెఎస్డబ్లు స్టీల్, టైటన్, కొటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బిపిసిఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా మోటార్స్ పతనమయ్యాయి. మరోవైపు ఒఎన్జిసి, విప్రో, టిసిఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎన్టిపిసి లాభపడ్డాయి.