శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్...పాక్ తలతిక్క నిర్ణయాలు!

     Written by : smtv Desk | Tue, Oct 15, 2019, 08:11 PM

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్...పాక్ తలతిక్క నిర్ణయాలు!

శ్రీలంక-పాకిస్థాన్ మధ్య డిసెంబరులో రెండు టెస్టుల సిరీస్ జరగాల్సి ఉండగా...ఈ సిరీస్‌ని కూడా పాక్‌లోనే నిర్వహించాలని పీసీబీ నిర్ణయించింది. అయితే.. శ్రీలంక మాత్రం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తటస్థ వేదికైన యూఏఈలో నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో.. సిరీస్‌పై సందిగ్ధత నెలకొనగా.. యూఏఈలో మ్యాచ్‌లు నిర్వహిస్తాం సగం ఖర్చు భరిస్తారా..? అంటూ శ్రీలంకకి పాక్ కొత్త మెలిక పెట్టింది. వాస్తవానికి భద్రతా కారణాలతో పాక్‌లో వన్డే, టీ20 సిరీస్ ఆడేందుకు శ్రీలంక సీనియర్ క్రికెటర్లు లసిత్ మలింగ, మాథ్యూస్, తిరుమానె తదితరులు నిరాకరించారు. దీంతో.. ద్వితీయ శ్రేణి జట్టుని పాక్ పర్యటనకి లంక పంపింది. అయితే.. టెస్టు సిరీస్‌లోనూ అదే జట్టుని పంపేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు సాహసించడం లేదు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మొదలైన నేపథ్యంలో.. ప్రతి టెస్టు మ్యాచ్‌ జట్లకి కీలకంకానుంది. మరోవైపు పాక్‌ గడ్డపై అడుగుపెట్టేందుకు శ్రీలంక సీనియర్ క్రికెటర్లు ససేమేరా అంటున్నారు. దుబాయ్‌లో జరుగుతున్న ఐసీసీ మీటింగ్‌‌కి అన్ని దేశాల క్రికెట్ బోర్డు పెద్దలు హాజరయ్యారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత శ్రీలంక బోర్డు పెద్దలతో టెస్టు సిరీస్‌ విషయమై మాట్లాడిన పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, సీఈవో వారిని ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. యూఏఈ వేదికగా అయితే సిరీస్ ఆడేందుకు తమకి ఎలాంటి అభ్యంతరం లేదని లంక తేల్చి చెప్పడంతో.. సిరీస్‌ నిర్వహణకి అయ్యే ఖర్చులో సగం భరిస్తే తమకీ అంగీకారమేనని పాక్ బోర్డు పెద్దలు కూడా స్పష్టం చేశారట. దీంతో.. సిరీస్‌పై చర్చ మళ్లీ మొదటికి వచ్చింది.





Untitled Document
Advertisements