వ్యక్తిగత రికార్డులపై కోహ్లీ దృష్టి పెట్టడు: షోయబ్

     Written by : smtv Desk | Tue, Oct 15, 2019, 08:33 PM

వ్యక్తిగత రికార్డులపై కోహ్లీ దృష్టి పెట్టడు: షోయబ్

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరంగంపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ఆ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లి (254 నాటౌట్: 336 బంతుల్లో 33x4, 2x6) టెస్టుల్లో తొలిసారి ట్రిఫుల్ సెంచరీ మార్క్‌ని కూడా అందుకునేలా కనిపించాడు. కానీ.. ఆ రోజు ఆఖరి సెషన్‌లో కనీసం అరగంట దక్షిణాఫ్రికాని బ్యాటింగ్ చేయించి వికెట్లు పడగొట్టడం ద్వారా ఒత్తిడిలోకి నెట్టాలని ఆశించిన కోహ్లీ.. అనూహ్యంగా ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేశాడు.వ్యక్తిగత రికార్డుల గురించి పట్టించుకోకుండా.. భారత్‌ ఇన్నింగ్స్‌ని కోహ్లీ డిక్లేర్ చేయడంపై షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాని ఫాలోఆన్ ఆడించిన భారత్ ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది. దీంతో.. సొంతగడ్డపై వరుసగా 11 టెస్టు సిరీస్‌లు గెలిచిన ఏకైక జట్టుగా కూడా రికార్డ్ నెలకొల్పింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.‘విరాట్ కోహ్లీ ఓ మంచి కెప్టెన్ అవుతాడని నేను గతంలోనే చెప్పాను. వరల్డ్‌ కప్‌ తర్వాత తప్పిదాల నుంచి అతను నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జట్టు టాప్ ఆర్డర్‌ని కూడా గాడిలో పెట్టాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీనే బెస్ట్ కెప్టెన్. మిగిలిన జట్ల కెప్టెన్లు అతనికి కంటే కొన్ని మైళ్ల దూరంలో ఉన్నారు. బెరుకులేని అతని కెప్టెన్సీ నాకు బాగా నచ్చుతుంది. వ్యక్తిగత రికార్డుల గురించి అతను ఏమీ ఆలోచించడు. పుణె టెస్టులో 254 పరుగులు సాధించి ట్రిఫుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేయడం ద్వారా తన మొదటి ప్రాధాన్యత దేశానికేనని కోహ్లీ చాటిచెప్పాడు. ఈ తత్వమే విరాట్ కోహ్లీలో నాకు బాగా నచ్చుతుంది’ అని అక్తర్ వెల్లడించాడు.పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఫిట్‌నెస్, ఫామ్‌పై ఇటీవల విమర్శలు గుప్పించిన షోయబ్ అక్తర్.. భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ‌పై ఈ తరహా‌లో ప్రశంసలు కురిపించడం కొత్తేమీ కాదు. వరల్డ్‌ కప్ సమయంలోనూ సర్ఫరాజ్ కంటే కోహ్లీకే ఎక్కువ మద్దతుగా అక్తర్ మాట్లాడాడు.





Untitled Document
Advertisements