ప్రధాని నరేంద్ర మోడీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హర్యానాలోని చర్ఖీ దద్రిలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ...ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ నాయకులు దేశంలోనూ ప్రపంచంలోనూ వదంతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ‘స్వచ్ఛమైన, పారదర్శకత ఉన్న బిజెపి ప్రభుత్వానికే ఓటు వేయాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఆ పార్టీకి మళ్లీ అధికారం కట్టబెట్టాలనుకున్నారు. రెజిలర్ బబితా ఫొగట్ దద్రీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయడం గురించి చెబుతూ ప్రధాని ‘హర్యానా ఆడబిడ్డలు అన్నిరంగాల్లో తమ సామర్థాన్ని రుజువు చేసుకున్నారని ప్రధాని కొనియాడారు.‘తను దంగల్ సినిమా చూసినట్టు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో లాంఛనంగా సమావేశమైనప్పుడు నాకు చెప్పారు. అది విని నేను గర్వపడ్డాను దంగల్ తర్వాత 29 ఏళ్ల బబిత పేరు ప్రతి కుటుంబంలోనూ వినిపిస్తోంది’ అని మోడీ ఇక్కడ జరిగిన ఒక ర్యాలీలో ప్రశంసించారు. బబితా ఫొగట్, ఆమె తండ్రి జీవితంపై దంగల్ సినిమా తీశారు. ‘మన ఆడపిల్లలు అబ్బాయిలకంటే ఎందులో తీసిపోయారు?’ అని ఆయన ప్రశ్నించారు. దద్రీ నియోజకవర్గంలో బబితా ఫొగట్ కాంగ్రెస్ అభ్యర్థి నృపేందర్సింగ్ సంగ్వాన్, జననాయక్ జనతా పార్టీ (జెజెపి) సత్పాల్ సంగ్వాన్ వంటి అనుభవజ్ఞులతో పోటీ పడుతున్నారు.