హుజూర్నగర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం కేసీఆర్ ఈ నెల 17న జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారని టిఆర్ఎస్ నేత, ఉపఎన్నిక ఇన్ఛార్జీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. మంగళవాం మీడి యా సమావేశంలో పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ, హుజూర్నగర్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారన్నారు. ఉపఎన్నికలో టిఆర్ఎస్ విజయం దాదాపుగా ఖాయమైనందన్నారు. అయితే భారీ మెజార్టీ సాధించాలన్న ఉద్దేశంతోనే ప్రచారానికి సిఎం కెసిఆర్ను ఆహ్వానించామన్నారు. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు ఏ పార్టీ తలపెట్టని విధంగా కెసిఆర్ సభను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సిఎం కెసిఆర్ మాటలు వినడానికి, ఆయనను చూడటానికి హుజూర్నగర్ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారని పల్లా తెలిపారు.ఈ సభకు సబ్బండ వర్గాలు ఎవ్వరికి వారు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారన్నారు. ఈ ఉపఎన్నిక హుజూర్నగర్ నియోజకవర్గం ప్రజల అదృష్టం మేరకే వచ్చిందన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో పులిచింతల బాధితుల సమ స్యకు, రెవిన్యూ రెవెన్యూ డివిజన్ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఉనికి కోసమే పోటీపడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న అహంకారంతో బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కడం అనుమానమేనని వ్యాఖ్యానించారు. కెసిఆర్ నేతృత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఇది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్కు ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టారన్నారు.2014కు కంటే 2018లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్కు సీట్ల సంఖ్య భాగా పెరిగిందంటేనే ప్రజల్లో కెసిఆర్ పట్ల ఉన్న విశ్వసనీయతకు నిదర్శమన్నారు. హుజూర్నగర్లో విజయం సాధించడం ద్వారా టిఆర్ఎస్ ఖాతాలోకి మరోసారి సీటు పెరగనుందన్నారు.