దారుణం...అక్కపై కోపంతో కుక్కను చంపేశాడు

     Written by : smtv Desk | Sat, Oct 19, 2019, 11:13 PM

దారుణం...అక్కపై కోపంతో కుక్కను చంపేశాడు

అక్కపై కోపంతో ఓ వ్యక్తి పెంపుడు కుక్కను చంపేశాడు . హైదరాబాద్‌లోని లాలాపేటలో శనివారం (అక్టోబర్ 19) ఉదయం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్తి వివాదంలో అక్కపై కోపం పెంచుకున్న సోదరుడు ఆమె పెంచుకుంటున్న కుక్కను గొంతు నులిమి హత్య చేశాడు. యజమానురాలి ఫిర్యాదు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.బాధితురాలు రమాదేవి తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆమె తన తల్లితో కలిసి సికింద్రాబాద్ పరిధిలోని లాలాపేటలో నివాసం ఉంటున్నారు. ఆమెకు తన సోదరుడు నాగరాజుతో కొంత కాలంగా ఆస్తి విషయంలో వివాదం నెలకొంది.రమాదేవి ‘పొమేరేనియన్’ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దాని వయసు ఏడేళ్లు. ఆస్తి విషయంలో అక్క రమాదేవిపై కక్ష పెంచుకున్న నాగరాజు.. ఆమె పెంపుడు కుక్కపై తన కోపం చూపించాడు.శుక్రవారం రాత్రి తన సోదరుడు నాగరాజు తన పెంపుడు కుక్క గొంతుపై కాలితో తొక్కి అతి కిరాతకంగా చంపేశాడని రమాదేవి ఫిర్యాదు చేశారు. నాగరాజుకు అతడి భార్య సాయం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పెంపుడు కుక్కను గొంతు నులిమి చంపి పైకి ఎత్తి పట్టుకోగా.. తాను చూశానని ఆమె పేర్కొన్నారు.రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నాగరాజు నేరం చేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కుక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణ గూడ వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.తన సోదరుడు మద్యానికి బానిసయ్యాడని.. తనను, తన తల్లిని చంపేస్తానని పలుమార్లు బెదిరించాడని పోలీసులతో రమాదేవి చెప్పారు. పలుమార్లు సాయం కోసం పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌కు కూడా కాల్ చేసినట్లు వెల్లడించారు. అక్క మీద కోపంతో పెంపుడు కుక్కను కిరాతకంగా హత్య చేసిన విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.





Untitled Document
Advertisements