దాయాది పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత్ జవాన్లపై యథేచ్ఛగా కాల్పులు జరపడంతో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని నియంత్రణరేఖ వద్ద ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కుప్వారా జిల్లా తాంఘర్ సెక్టార్ సరిహద్దులో భారత్ బలగాలు గస్తీ నిర్వహిస్తుండగా పాకిస్థాన్ కాల్పులకు తెగబడడంతో భారత్ ఎదురు దాడి చేసింది. కాల్పుల మాటున చొరబాటుదారులను భారత్ భూభాగంలోకి పంపించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించిందని, భారత్ బలగాలు దీన్ని సమర్థంగా తిప్పికొట్టాయని సైనిక వర్గాలు వెల్లడించాయి. కాగా, పాక్ బలగాల కాల్పుల్లో ముగ్గురు పౌరులు గాయపడగా, రెండిళ్లు దెబ్బతిన్నాయి.