రాంచీ టెస్టులో ఉమేశ్ యాదవ్ సిక్సర్లతో రికార్డులు మోత!

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 06:07 PM

రాంచీ టెస్టులో ఉమేశ్ యాదవ్ సిక్సర్లతో రికార్డులు మోత!

రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత టెయిలెండర్ బ్యాట్స్‌మెన్ ఉమేశ్ యాదవ్ 5 సిక్సర్లతో కొత్త రికార్డ్‌ల్ని సృష్టించాడు. మ్యాచ్‌లో రెండో రోజైన ఆదివారం రెండో సెషన్‌లో బ్యాటింగ్‌‌కి వచ్చిన ఉమేశ్ యాదవ్ (31: 10 బంతుల్లో 5x6) రెండు ఓవర్ల వ్యవధిలోనే ఏకంగా 5 సిక్సర్లు బాదేశాడు. స్పిన్నర్ జార్జ్ లిండే బౌలింగ్‌ని లక్ష్యంగా చేసుకున్న ఉమేశ్.. అన్ని సిక్సర్లూ అతడికే కొట్టి.. వికెట్ కూడా సమర్పించుకున్నాడు.టెస్టు మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్నీ సిక్సర్లుగా మలిచిన ఉమేశ్ యాదవ్.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో సచిన్ అప్పట్లో ఈ ఘనత సాధించాడు. ఇక 10 బంతుల్లోనే 310 స్ట్రైక్‌రేట్‌తో 31 పరుగులు చేసిన ఉమేశ్ యాదవ్.. టెస్టు క్రికెట్‌లోనే అత్యధిక స్ట్రైక్ రేట్‌తో(కనీసం 25 పరుగులు) బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.భారత టెస్టు క్రికెట్ చరిత్రలో కేవలం నలుగురు బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే.. మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్‌గా మలిచారు. సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, మహేంద్రసింగ్ ధోనీ మాత్రమే ఇప్పటి వరకూ ఈ రికార్డ్‌లో ఉండగా.. ఈరోజు వారి సరసన ఉమేశ్ కూడా చేరాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌ని ఆదివారం 497/9తో డిక్లేర్ చేయగా.. ఈరోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 9/2తో నిలిచింది.





Untitled Document
Advertisements