హత్య జరిగిన 24 గంటల్లోపే నిందితులను గుర్తించిన పోలీసులు!

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 06:14 PM

హత్య జరిగిన 24 గంటల్లోపే నిందితులను గుర్తించిన పోలీసులు!

అయోధ్య కేసులో కక్షిదారు, హిందూత్వ సంస్థ నేత కమలేశ్‌ తివారీ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన 24 గంటల్లోపే నిందితులను గుర్తించడం విశేషం. తాజాగా, నిందితులకు సంబంధించిన వస్తువులను లక్నో లాల్‌బాగ్‌లోని ఓ హోటల్‌ నుంచి ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసిన పోలీసులు.. నిందితులు అష్కప్ హుస్సేన్ అండ్ మెయినుద్దీన్ అహ్మద్‌లుగా పేర్కొన్నారు. వీరిద్దరూ గుజరాత్‌లోని సూరత్ పట్టణం జిలానీ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉన్నట్టు తెలిపారు. ఇద్దరూ అక్టోబరు 17న రాత్రి 11.00 గంటలకు హోటల్ దిగి.. అక్టోబరు 18న మధ్యాహ్నం 1.37 గంటలకు ఖాళీచేశారని వెల్లడించారు. నిందితులు తీసుకున్న గదిలో షేవింగ్ కిట్, మొబైల్ బాక్స్, కాషాయ రంగు దుస్తులు, రక్తపు మరకలు ఉన్న టవల్, బ్యాగు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. తివారీ నివాసం సమీపంలోని సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించారు.గతంలో ఓ మత గురువుకు వ్యతిరేకంగా కమలేశ్‌ చేసిన వ్యాఖ్యలతోనే ఆయనను పథకం ప్రకారమే హత్య చేశారని ఉత్తర్‌ ప్రదేశ్‌ డీజీపీ ఓపీ సింగ్‌ తెలిపారు. హత్య జరిగిన ప్రాంతాన్ని ఉన్నతాధికారులతో కలిసి సందర్శించామని డీజీపీ తెలిపారు. ఆ ప్రదేశంలో సూరత్‌లో దుకాణం నుంచి కొనుగోలు చేసిన స్వీటు బాక్సులు వంటి కొన్ని ఆధారాలు లభించాయని, వీటి సాయంతో 24 గంటల్లో కేసును ఛేదించవచ్చని నమ్మకం కలిగిందని అన్నారు. వెంటనే సూరత్‌ పోలీసులను అప్రమత్తం చేసి, ముగ్గురు అనుమానితుల్ని గుర్తించామని తెలిపారు.ఈ కేసులో మరో ఇద్దరు అనుమానితుల్ని మొరదాబాద్‌లో గుర్తించినట్టు డీజీపీ తెలిపారు. వీరు స్థానిక దుకాణాల్లో పని చేసేవారని తెలిపారు. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరపాల్సి ఉందని వెల్లడించారు. కమలేశ్‌ తివారీ (43) లఖ్‌నవూలోని ఆయన నివాసంలో దుండగులు గొంతు కోసి హత్యకు పాల్పడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతి చెందారు. 2015లో కమలేశ్ తివారీ చేసిన వ్యాఖ్యలపై కొన్ని మత సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.అంతేకాదు ఆయనపై రూ.1.5 కోట్ల రివార్డును కూడా ప్రకటించాయి. ఐఎస్ ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఈయన పేరు ఉంది. మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ.. అల్లర్లను ప్రేరేపించేందుకే ఈ హత్యను చేశారని విమర్శించారు. ఇలాంటి సహంచబోమని ఆయన తేల్చి చెప్పారు.మరోవైపు, సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కమలేశ్ తివారీ కుటుంబసభ్యులు ఆదివారం భేటీ అయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు సీఎంను కోరారు. దీనిపై స్పందించిన యోగి... దర్యాప్తు జరుగుతోందని, ఎవర్నీ విడిచిపెట్టేదిలేదని పేర్కొన్నారు. కమలేశ్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎంతో సమావేశం అనంతరం కమలేశ్ భార్య మాట్లాడుతూ.. తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని అన్నారు.





Untitled Document
Advertisements