దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత బ్యాట్స్మెన్లు తమ సత్తా చాటారు. సిరీస్ ఆరంభానికి ముందు అందరూ సఫారీలని టీమిండియా ఎలా స్పిన్ ఉచ్చులో బిగిస్తుందో..? అని చర్చించారు. కానీ.. వైజాగ్ టెస్టు నుంచి పుణె, రాంచీ టెస్టు వరకూ అందరూ ఇప్పుడు భారత బ్యాటింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఆఖరి టెస్టు జరుగుతుండగా.. దక్షిణాఫ్రికా నుంచి కేవలం రెండే రెండు శతకాలు నమోదయ్యాయి. కానీ.. భారత్ నుంచి ఏకంగా మూడు డబుల్ సెంచరీలు, మూడు సెంచరీలు నమోదయ్యాయి. ఈ గణాంకాల్ని బట్టే సిరీస్లో సఫారీలపై టీమిండియా ఏ తరహాలో ఆధిపత్యం చెలాయిస్తుందో అర్థం చేసుకోవచ్చు.విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (215: 371 బంతుల్లో 23x4, 6x6) డబుల్ సెంచరీతో చెలరేగగా.. పుణెలో జరిగిన రెండో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి (254 నాటౌట్: 336 బంతుల్లో 33x4, 2x6) అజేయ ద్విశతకాన్ని నమోదు చేశాడు. తాజాగా రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో మరో ఓపెనర్ రోహిత్ శర్మ (212: 255 బంతుల్లో 28x4, 6x6) డబుల్ సెంచరీ బాదేశాడు. టెస్టు కెరీర్లో మయాంక్, రోహిత్ శర్మకి ఇవే తొలి ద్విశతకాలుకాగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి అది ఏడో డబుల్ సెంచరీ.ఒక టెస్టు సిరీస్లో భారత బ్యాట్స్మెన్లు ఇలా మూడు డబుల్ సెంచరీలు బాదడం చరిత్రలో ఇది రెండోసారికాగా.. 64 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైమ్. 1955-56లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో భారత మాజీ క్రికెటర్లు వినో మాన్కండ్ రెండు, పాలీ ఉమ్రిగర్ ఒక డబుల్ సెంచరీ బాదారు. ఆ తర్వాత ఇన్నాళ్లకి ఈ రికార్డ్ని మయాంక్, కోహ్లీ, రోహిత్ శర్మ ద్విశతకాలతో సమం చేశారు.