నోబెల్ బహుమతి విజేత అభిజిత్ బెనర్జీపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ వాద్రా స్పందించారు. పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకోవడం ప్రభుత్వం బాధ్యత అని, కామెడీ సర్కస్ చేయడం కాదని శనివారం మండిపడ్డారు. శుక్రవారం గోయల్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకం ‘న్యాయ్’ను ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించారు. ఆ పథకాన్ని అభిజిత్ బెనర్జీ సమర్థించారు. బెనర్జీ వామపక్ష భావజాలమున్న వ్యక్తి’ అని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యపై ప్రియాంక ఘాటుగా స్పందిస్తూ బిజెపి నాయకులు తమ పని తాము చేసుకోవడానికి బదులు ఇతరులు సాధించిన విజయాలపై దురభిప్రాయం కలిగేలా మాట్లాడుతున్నారన్నారు. ‘ బెనర్జీ నిజాయితీగా పనిచేసి నోబెల్ బహుమతి పొందారు’ అన్నారు. ‘ఒకవైపు ఆర్థికరంగం పతనమవుతోంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది(ప్రభుత్వం). అంతేకానీ కామెడీ సర్కస్ చేయడం కాదు’ అని ప్రియాంక స్పష్టం చేశారు.