రాంచి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఓపెనర్ రోహిత్ శర్మ వీరంగం సృస్టించాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ క్రికెటర్ డాన్ బ్రాడ్మన్ పేరిట 71 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. స్వదేశంలో టెస్టు క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన క్రికెటర్గా బ్రాడ్మన్ (98.22 సగటుతో) ఉండగా, తాజాగా ఈ రికార్డును రోహిత్ అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ స్వదేశంలో ఆడిన గత పది టెస్టుల్లో సగటు 99.84. ఏ ఆటగాడైనా గత పది ఇన్నింగ్స్ల్లో సాధించిన సగటును పరిగణలోనికి తీసుకొని ఈ రికార్డును ప్రకటిస్తారు. రోహిత్ ఈ మ్యాచ్లో మరో కొన్ని రికార్డులు సైతం తన పేరిట లిఖించుకున్నాడు. విండీస్ బ్యాట్స్మెన్ షిమ్రాన్ హిట్మైర్ ఓ టెస్టు సిరీస్లో సాధించిన అత్యధిక సిక్సుల రికార్డును సైతం బద్దలు కొట్టాడు. హిట్మైర్ బంగ్లాతో జరిగిన సిరీస్లో 15 సిక్సులు బాదగా, రోహిత్ 16 సిక్సులతో ఈ రికార్డును తుడిచిపెట్టాడు. ఓ టెస్టు సిరీస్లో రెండు అంతకన్నా ఎక్కువ సెంచరీలు బాదిన రెండో ఓపెనర్ గా రోహిత్ రికార్డు పుటాల్లోకెక్కాడు. ఇంతకు ముందు సునీల్ గవాస్కర్ మూడు సార్లు ఈ ఫీట్ను సాధించాడు.