రాంచీ వేదికగా భారత్-దక్షిణాఫ్రిక మధ్య జరుగుతున్న మూడో టెస్టులో కూడా భారత ఆధిపత్యం కొనసాగుతుంది.సోమవారం ఓవర్నైట్ స్కోరు 9/2తో తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు తొలి సెషన్ ముగిసే సమయానికి 129/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో జార్జ్ లిండే (10), డానె పైట్ (4) ఉండగా.. ఆ జట్టు ఇంకా భారత్ కంటే 368 పరుగులు తొలి ఇన్నింగ్స్లో వెనకబడి ఉంది. ఈరోజు తొలి సెషన్ ఫస్ట్ ఓవర్లోనే డుప్లెసిస్ (1) వికెట్ పడగొట్టిన ఉమేశ్ యాదవ్.. సఫారీలకి ఊహించని షాకిచ్చాడు. కానీ.. టీ20 తరహా ఆటతో రెచ్చిపోయిన హజ్మా (62: 79 బంతుల్లో 10x4, 1x6) మెరుపు హాఫ్ సెంచరీ బాది మళ్లీ సఫారీ జట్టుని రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. అయితే.. ఇన్నింగ్స్ 28వ ఓవర్ వేసిన జడేజా తెలివైన బంతితో హజ్మాని క్లీన్బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత తెంబ బవుమా (32: 72 బంతుల్లో 5x4)ని నదీమ్ ఔట్ చేయగా.. కెరీర్లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (6)ని జడేజా బోల్తా కొట్టించేశాడు. మరోవైపు ఫస్ట్ టెస్టు మ్యాచ్ ఆడుతున్న నదీమ్కి కూడా బవుమానే ఫస్ట్ వికెట్. రాంచీ పిచ్ స్పిన్నర్లకి అనుకూలిస్తుందని గత వారం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. ఎడమచేతి వాటం స్పిన్నర్లు ఈ పిచ్పై ఎక్కువ వికెట్లు తీసి ఉండటంతో.. టీమిండియా తెలివిగా జడేజాతో పాటు నదీమ్ రూపంలో ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లని తీసుకుంది. తొలి సెషన్లోనే ఈ ఇద్దరూ మూడు వికెట్లు పడగొట్టి సఫారీ బ్యాట్స్మెన్లను ఒత్తిడిలోకి నెట్టడం సఫలమయ్యారు.