ఎల్ఐసీ‌లో కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్....నెలకు రూ.10,000

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 02:01 PM

ఎల్ఐసీ‌లో కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్....నెలకు రూ.10,000

రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ డబ్బులు పొందేందుకు చాలా స్కీమ్స్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్స్ లోకి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్కీమ్‌ను అందుబాటులో ఉంచింది. దీని పేరు ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై). కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ లక్ష్యంగా ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో చేరితే పదేళ్లపాటు రెగ్యులర్‌గా పెన్షన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా సబ్‌స్క్రైబర్ మరణిస్తే చెల్లించిన మొత్తం వెనక్కు వస్తుంది. 2020 మార్చి 31 వరకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఎల్ఐసీ ద్వారా ఈ పథకంలో చేరొచ్చు.స్కీమ్‌లో చేరాలంటే కనీసం 60 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయో పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ స్కీమ్‌లో చేరాలంటే కనీసం రూ.1.44 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. https://eterm.licindia.in/onlinePlansIndex/pmvvymain.do లింక్‌పై క్లిక్ చేసి స్కీమ్‌లో చేరొచ్చు. పీఎం వయ వందన యోజనలో చేరాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి అవసరం అవుతాయి. ఒకేసారి డబ్బులు చెల్లించి స్కీమ్‌లో చేరాల్సి ఉంటుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పెన్షన్ పొందొచ్చు. నెలకు రూ.1,000 నుంచి రూ.10,000 వరకు పెన్షన్ వస్తుంది. మీరు కొనుగోలు చేసిన మొత్తం ప్రాతిపదికన పెన్షన్ మారుతుంది. పాలసీ తీసుకుని మూడేళ్లు గడిచిన తర్వాత పాలసీపై లోన్ కూడా తీసుకోవచ్చు. మీరు కొనుగోలు చేసిన మొత్తంలో 75 శాతం వరకు లోన్ లభిస్తుంది. అయితే ఈ స్కీమ్‌లో చేరడం వల్ల ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు. పథకంలో చేరిన వారు పదేళ్లలోపు మరణిస్తే కొనుగోలు చేసిన మొత్తాన్ని పూర్తిగా నామినీకి తిరిగి వెనక్కు ఇచ్చేస్తారు. పదేళ్ల తర్వాత కూడా సబ్‌స్క్రైబర్ జీవించి ఉంటే.. అప్పుడు కొనుగోలు చేసిన మొత్తాన్ని, చివరి పెన్షన్ డబ్బుల్ని కలిపి చెల్లిస్తారు.





Untitled Document
Advertisements