ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ టాప్

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 12:12 PM

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ టాప్

ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ జోరు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకోవడంతో 120 పాయింట్లని ఖాతాలో వేసుకున్న టీమిండియా.. మొత్తం 240 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.ఆగస్టు 1 నుంచి ఈ టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలవగా.. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడుతున్నాయి. ప్రతి సిరీస్‌కి ఐసీసీ 120 పాయింట్లను కేటాయిస్తుండగా.. సిరీస్‌లో మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా వాటిని విభజిస్తారు. టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలైన తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకోవడం ద్వారా 120 పాయింట్లని ఖాతాలో వేసుకున్న భారత్ జట్టు.. తాజాగా దక్షిణాఫ్రికాపై గెలిచి మరో 120 పాయింట్లని దక్కించుకుంది. దీంతో.. మొత్తం 240 పాయింట్లతో భారత్ జట్టు పట్టికలో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్ (60), శ్రీలంక (60), ఆస్ట్రేలియా (56), ఇంగ్లాండ్ (56) టాప్-5లో ఉన్నాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఇటీవల ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ జరగగా.. చెరో రెండింటిలో గెలుపొంది.. ఒక టెస్టుని డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. మరోవైపు రెండు టెస్టుల సిరీస్ ఆడిన న్యూజిలాండ్, శ్రీలంక చెరొక మ్యాచ్‌లో గెలిచాయి. కానీ.. టీమిండియా మాత్రం ఛాంపియన్‌షిప్ మొదలైన తర్వాత ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలైన తర్వాత వెస్టిండీస్ రెండు, దక్షిణాఫ్రికా మూడు టెస్టులు ఆడినప్పటికీ.. ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయాయి. దీంతో.. అవి ఇంకా పట్టికలో ఖాతా తెరవలేదు. ఇక మిగిలిన బంగ్లాదేశ్, పాకిస్థాన్ టీమ్స్ ఆగస్టు నుంచి ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే.. నవంబరులో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్‌ టెస్టు సిరీస్ ఆడనుండగా.. భారత్‌తో బంగ్లాదేశ్‌ రెండు టెస్టుల్లో ఢీకొట్టబోతోంది.





Untitled Document
Advertisements