భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో మంగళవారం నౌకాదళ కమాండర్ల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. నౌకాదళం నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని, 26/11 దాడులను పునరావృతం కానివ్వబోదని చెప్పారు. ఏ దేశంపైనైనా దాడి చేయడం గానీ, ఏ దేశ భూభాగంలో అంగుళం స్థలాన్ని ఆక్రమించడం భారత్ అభిమతం కాదు. కానీ మాపై దాడికి కుట్ర పన్నిన వారికి మాత్రం ధీటుగా సమాధానమిచ్చేందుకు మా సైనిక బలగాలకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని అన్నారు. భారత నౌకాదళం చేతుల్లో సముద్ర తీరం సురక్షితంగా ఉందని రాజ్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ 26/11 తరహా దాడిని పునరావృతం కానివ్వకుండా నౌకాదళం సముద్ర తీర ప్రాంతాలపై పటిష్ఠ నిఘా కొనసాగిస్తుందన్నారు. దేశీయంగా తయారైన రక్షణ వ్యవస్థలపైనే నౌకాదళం అత్యధికంగా ఆధారపడి ముందుకు సాగుతున్నదని తెలిపారు. త్రివిధ దళాలు రక్షణ దిగుమతులను తగ్గించుకోవాల్సిన అవసరంపై దృష్టి సారించాయని చెప్పారు. ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సరైన టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలన్నారు.