తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ అనంతరం భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా కోహ్లీ పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. కోహ్లీ మాట్లాడుతూ... ఐదు రోజుల ఫార్మాట్లో బెస్ట్ టీమ్ కావడమే మా టార్గెట్. అందుకోసం నిజాయితీగా శ్రమించాం. దానికి తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. మా ఆట ఎలా ఉందో మీరందరూ చూశారు. పెద్దగా సహకారం అందని పిచ్లపై కూడా ఫలితాలను రాబట్టాం. ఇది నిజంగా గర్వపడాల్సిన విషయం. విదేశాల్లోనూ మేము గట్టిపోటీ ఇవ్వడానికే ప్రయత్నించాం. వరల్డ్ బెస్ట్ టీమ్గా నిలబడాలంటే.. అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. సరైన మైండ్సెట్ కావాలి. దానికోసం జట్టులోని ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. స్పిన్ ఎప్పుడూ మా బలం. బ్యాటింగ్ అనేది ఎప్పుడూ సమస్య కాదు. కానీ ఇషాంత్ తప్ప అనుభవమున్న బౌలర్ మాకు లేడు. బ్యాటింగ్ సంగతి మాకు వదిలేసి ఎక్స్ట్రా పేసర్ను ఇవ్వండని అడిగాం. చెప్పినట్టుగానే ప్రతీ మ్యాచ్లో రన్స్ చేశాం. అనుభవం లేకున్నా సిరీస్ అంతా బాగా ఆడాం. దీంతో ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలమనే నమ్మకం ఏర్పడింది. పాజిటివ్ మైండ్సెట్ వల్లే జట్టుగా రాణిస్తున్నాం. దాని ఫలితమే 31 మ్యాచ్ల్లో విజయం. ఈ ప్రయాణం మరింత దూరం కొనసాగిస్తాం.
ఆ క్రెడిట్ రోహిత్దే..:
బ్యాట్స్మన్గా రోహిత్కు తిరుగులేదు. ఓపెనర్గా తొలి సిరీస్లోనే సత్తా చాటాడు. బలహీనతలను అధిగమించి అద్భుతంగా ఆడాడు. ఈ విషయంలో క్రెడిటంతా రోహిత్కే చెందుతుంది. లిమిటెడ్ ఓవర్లలో తిరుగులేని ఓపెనర్గా పేరు తెచ్చుకున్న రోహిత్.. టెస్ట్ల్లో ఎలా పెర్ఫామ్ చేస్తాడో చూడాలని ఎప్పటి నుంచో ఉండేది. అలాంటిది తన బ్యాటింగ్ వల్లే ప్రొటీస్ను రెండు సార్లు ఆలౌట్ చేశాం. మయాంక్ కూడా బాగా ఆడాడు.
వాళ్లిద్దరూ ది బెస్ట్..:
పేసర్లు ఉమేశ్, షమీ ఈ సిరీస్లో ది బెస్ట్. వాళిద్దరి స్ట్రయిక్రేట్ స్వదేశంలోనే అత్యుత్తమం. వాళ్లు బాల్తో ఎన్నిసార్లు వికెట్లను, ప్యాడ్స్ను కొట్టారో స్ట్రయిక్రేట్ చూస్తే అర్థమవుతుంది. ఫిట్నెస్ పరంగా కూడా చాలా మెరుగయ్యారు. సవాళ్ల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నారు. అందుకే అవసరమైన ప్రతీసారి వికెట్ తీసి టీమ్ను రేస్లో ముందుంచారు.
మహీ గురించి దాదా అడగలేదు..:
సౌరవ్ గంగూలీ.. బీసీసీఐ ప్రెసిడెంట్ అవ్వడం చాలా గొప్పగా, గర్వంగా ఉంది. దాదాకు శుభాకాంక్షలు కూడా చెప్పాను. కానీ మా మధ్య ధోనీ గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. దాదా రమ్మన్నప్పుడు వెళ్లి కలుస్తాను. అన్ని విషయాలను చర్చిస్తాను.
ఐదు టెస్ట్ సెంటర్లు చాలు..:
టెస్ట్ మ్యాచ్ల కోసం ఇండియాలో ఐదు శాశ్వత వేదికలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ విషయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అనుసరిస్తున్న విధానాన్ని ఇండియాలోను అమలు చేయాలి. స్పెషల్గా రూపొందించిన ఐదు స్టేడియాల్లో టెస్ట్లను నిర్వహిస్తే.. మరింత ఆసక్తికరంగా మారుతుంది. దీనివల్ల ఇండియా టూర్కు వచ్చే విదేశీ జట్లకు.. ఎక్కడ ఆడతాం, ఎలాంటి ప్రేక్షకులు ఉంటారు, ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనే దానిపై మంచి అవగాహన ఉంటుంది. విదేశాలకు వెళ్లినప్పుడు మేం కూడా ఇదే ఎదుర్కొంటాం. పిచ్ ఎలా ఉంటుందో తెలిస్తే.. అభిమానుల మద్దతు కూడా పెరుగుతుంది. స్టేడియాలు కూడా నిండుతాయి. రాష్ట్ర సంఘాల మనుగడ కోసం మన దగ్గర రొటేషన్ పాలసీ ఉన్నా.. దానిని వన్డే, టీ20లకే పరిమితం చేయాలి.