ఢిల్లీ: ప్లాస్టిక్ కవర్ ఇవ్వలేదని కస్టమర్ ఓ బేకరీలో పని చేసే వ్యక్తిని ఇటుకతో కొట్టి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఖలీల్ అహ్మద్ (45) అనే వ్యక్తి దయల్పూర్ ప్రాంతంలోని ఓ బేకరీలో పని చేసేవాడు. ఫాయిజ్ ఖాన్ అనే వ్యక్తి బేకరీలో ఒక వస్తువు కొని ప్లాస్టిక్ కవర్ ఇవ్వమని డిమాండ్ చేశాడు. దీంతో ఖలీల్ ప్లాస్టిక్ కవర్లు తమ షాపులో లేవని, నిషేధం విధించడంతో ప్లాస్టిక్ కవర్లు వాడటం లేదని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన ఫాయిజ్ ఇటుకతో ఖలీల్ తలపై గట్టిగా బాదాడు. దీంతో ఖలీల్ వెంటనే కిందపడిపోయాడు. షాప్ యజమాని వెంటనే ఖలీల్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడు అప్పటికే చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.