వైరల్ .. చంటి పిల్లాడి పక్కలో దెయ్యం....

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 12:43 PM

చికాగో: ఏ తల్లయినా తన పిల్లలు క్షేమంగా ఉండాలనే కోరుకుంటుంది. అయితే..తన కుమారుడి పక్కలో పడుకుని ఉన్న దెయ్యాన్ని చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ పిల్ల దెయ్యాన్ని కంప్యూటర్ మానిటర్ క్యామ్‌లో చూసిన ఆ తల్లి నిద్రపోలేకపోయింది. దాని అంతుతేల్చాలనుకుంది.. కానీ, అసలు ఏం జరిగిందంటే… చికాగోలోని నాపెర్‌విల్లేలో నివసించే మారిజా ఎలిజెబెత్ రాత్రి తన గదిలో నిద్రించే ముందు వేరే గదిలో నిద్రిస్తున్న తన కుమారుడిని టివి మానిటర్ క్యామ్‌లో చూసింది. హఠాత్తుగా ఆమెకు తన బిడ్డ పక్కన పడుకున్న ఒక పిల్ల దెయ్యం తల కనిపించింది. వెంటనే ఆమె ఫ్లాష్‌లైట్ తీసుకుని ఆ గదిలోకి వెళ్లి చూడగా అక్కడ ఏమీ కనిపించలేదు. ఆమె గదంతా గాలించినా ఫలితం శూన్యం. అయోమయంగా తన గదిలోకి వచ్చేసిన ఆమెకు రాత్రంతా కలత నిద్రతోనే గడిచింది. ఇంతలో తెల్లారిపోయింది. ఆ పిల్ల దెయ్యం సంగతి అంతు తేలుద్దామని ఆమె తిరిగి తన కుమారుడు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లింది.

అంతే అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె నివ్వెరపోయింది. తాను రాత్రి చూసిన పిల్ల దెయ్యం తన కుమారుడి పక్కనే ఉంది. అయితే అది దెయ్యం కాదు. ఆమె కుమారుడు కప్పుకున్న దుప్పటి పైన ముద్రించి ఉన్న ఒక పిల్లాడి ఫోటో. బెడ్‌లైటు పడి ఆ ఫోటో తెల్లగా వెలుగు పరుచుకున్నట్లు కనిపించడంతో దాన్ని చూసి తాను దెయ్యమని భ్రమించినట్లు ఆమె గుర్తించింది. ఆ ఫోటోనే తనను రాత్రంతా కలవరపెట్టిందని తెలుసుకుని ఆమె ఊపిరి పీల్చుకోవడమే కాదు పిల్లాడికి దుప్పటిని సరిగ్గా కప్పని తన భర్తను చంపెయ్యాలన్నంత కోపం ఆమెకు వచ్చింది. రాత్రి జరిగిన సంఘటనను వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఈ పోస్ట్ చదివి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోయారు. మన కళ్లే మనల్ని మోసం చేస్తాయనడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అక్కర్లేదని కొందరు కామెంట్లు కూడా చేశారు.





Untitled Document
Advertisements