బాబాయ్ అని పిలిచే బాలికలపై కీచకుడు అత్యాచారం

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 09:58 AM

బాబాయ్ అని పిలిచే బాలికలపై కీచకుడు అత్యాచారం

విశాఖలో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని గోపాలపట్నం ప్రాంతానికి చెందిన అరవింద్ అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య స్థానికంగా బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తోంది. ఆమె వద్ద పనిచేస్తున్న ఓ మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆమె భర్త చనిపోవడంతో ఆ కుటుంబానికి అరవింద్‌ ఏ సాయం కావాలన్నా చేసేవాడు. దీంతో ఆ బాలికలు అతడిని బాబాయ్ అని పిలిచేవారు. అయితే ఆ కుటుంబానికి ఏ ఆసరా లేకపోవడాన్ని అలుసుగా తీసుకున్న అరవింద్ అక్కాచెల్లెళ్లపై కన్నేశాడు. పెద్ద అమ్మాయి(15)తో చనువుగా ఉంటూ కావాల్సిన వస్తువులన్నీ కొనిచ్చి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత చిన్న అమ్మాయి(13)పై కూడా కన్నేశాడు. కొద్దిరోజుల క్రితం ఇద్దరు బాలికలను కారులో ఎక్కించుకుని నగరం దాటాడు. విజయవాడతో పాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన కూతుళ్లు కనిపించకపోవడంతో తల్లి గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసుల అరవింద్ చెర నుంచి వారిని రక్షించి తల్లికి అప్పగించారు. ఇంటికి వెళ్లిన బాలికలు అరవింద్ తమపై జరిపిన అఘాయిత్యాల గురించి తల్లికి చెప్పి బోరుమన్నారు. దీంతో షాకైన ఆమె మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలడంతో అరవింద్‌పై కిడ్నాప్‌తో పాటు అత్యాచారం కేసు నమోదు చేశారు. బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే బాలికలను వంచించి వారిపై అఘాయిత్యానికి పాల్పడిన అరవింద్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






Untitled Document
Advertisements