జగన్ బెయిల్ రద్దు చేసే యోచనలో సీబీఐ?

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 10:32 PM

జగన్ బెయిల్ రద్దు చేసే యోచనలో సీబీఐ?

టీడీపీ నేత బోండా ఉమా సోషల్ మీడియాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై సంచలన పోస్ట్ చేశారు. విజయ సాయిరెడ్డి లేవనెత్తిన విషయాన్ని కేంద్రం సున్నితంగా తిరస్కరించిందంటూ.. అఖిలపక్ష భేటీలో వైఎస్ఆర్సీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఛోటా నాయకులే ఇలాంటి ప్రచారం చేయగా.. ఇప్పుడు బోండా ఉమా సైతం జగన్‌ బెయిల్ రద్దు చేసే యోచనలో సీబీఐ ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయడం గమనార్హం. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ సీబీఐ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా.. ఇటీవలే దాన్ని న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రతి వారం న్యాయస్థానానికి హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో జగన్ బెయిల్ రద్దు చేస్తారంటూ.. గత కొద్ది రోజులుగా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. ఏపీ సీఎంపై ట్రోలింగ్‌కు దిగుతున్నాయి. సుదీర్ఘ కాలంగా బెయిల్ పొందిన వారందరికీ.. బెయిల్ రద్దు చేసి వెంటనే జైలుకు పంపాలని సుప్రీం కోర్టు సీబీఐని కోరిందంటూ ప్రచారం చేస్తున్నారు. 4 వారాల గడువులోగా వీళ్లను జైళ్లకు పంపాలని సీబీఐ కోరిందని.. ఈ జాబితాలో జగన్ పేరు కూడా ఉందని ప్రచారం చేస్తున్నారు. ఇంకొందరైతే.. మరో అడుగు ముందుకేసి.. దేశ వ్యాప్తంగా బెయిల్ మీద బయట ఉన్న వారందరి బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేయమని సీబీఐ, ఈడీ, డీఆర్ఐలకు కేంద్ర హోం శాఖ ఆదేశించిందని.. జగన్ జైలుకు వెళ్తే.. ఆయన భార్య సీఎం అవుతారంటూ తోచిన రీతిలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు తిప్పి కొడుతున్నాయి. కేసుల విచారణ కొనసాగుతుండగా.. బెయిల్ రద్దు చేయడమేంటని జగన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇది శునకానందం అని ఎద్దేవా చేస్తున్నారు.








Untitled Document
Advertisements