ఆర్టిసి ప్రైవేటీకరణపై నేడు(సోమవారం) హైకోర్టులో విచారణ జరుగునున్న నేపథ్యంలో సమ్మెలో పాల్గొంటున్న కార్మికులలో ఆసక్తితో పాటు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఆర్టిసి ఎండి సునీల్ శర్మ ఫైనల్ అఫిడవిట్ హైకోర్టుకు దాఖలు చేయడంతో కార్మిక వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది. కార్మికులు స్వచ్ఛందంగా విధుల్లో చేరేందుకు ముందుకొచ్చినప్పటికీ వారి కొనసాగింపు పై నిర్ణయం తీసుకోవడం ఆర్టిసి యాజమాన్యానికి కష్టంగా మారిందని,రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా తగిన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆర్టిసి ఎండి కోరిన విషయం విదితమే. ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ను జెఎసి నేతలు తాత్కాలికంగా పక్కన పెట్టినా, తిరిగి ఏ క్షణమైనా ఆ డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చే అవకాశ ఉందని ఇంచార్జ్ ఎండి సునీల్ శర్మ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొనడం, సమ్మె పరిష్కారానికి హైకోర్టు సూచించిన తిసభ్య కమిటీని ప్రభుత్వం తిరస్కరించడంతో నేటి విచారణ అర్టిసి కార్మికుల్లో సర్వత్రా ఉత్కంఠంగా మారింది.