రఘురామ్ రాజన్ సంచలన వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Sun, Dec 08, 2019, 07:11 AM

దేశంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి హెచ్చరించారు.‘ఇండియా టుడే’ పత్రికలో రాసిన వ్యాసంలో ఆయన పలు కీలక అంశాలను వెల్లడించారు. ముఖ్యంగా గ్రామాణ ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టస్థాయికి చేరుకున్న విషయాన్ని రాజన్ గుర్తు చేశారు. నిరుద్యోగిత రేటు తీవ్రస్థాయిలో ఉందన్నారు. రియల్టీ, కన్‌స్ట్రక్షన్, మాన్యుఫాక్చర్ రంగాలకు పెద్ద ఎత్తున రుణాలిచ్చే నాన్ బ్యా్ంకంగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్‌బిఎఫ్‌సి)ఆస్తుల నాణ్యతను పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర బ్యాంక్ 50 టాప్ ఎన్‌బిఎఫ్‌సిల పనితీరును పరిశీలిస్తోందని చెప్పిన ఆయన వాటి పని తీరును అసెట్ నాణ్యతను కూడా ఆర్‌బిఐ పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. కాగా షాడో బ్యాంకింగ్ రంగంలో మొత్తం ఆస్తులలో 75 శాతం వాటా కలిగి ఉన్న 50 టాప్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియర్లను సెంట్రల్ బ్యాంక్ నిశితంగా గమనిస్తుందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గురువారం విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. అలాగే దేశంలోని టాప్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కుప్పకూలకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే . కాగా నిర్మాణ రంగ ప్రాజెక్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, సుమారు 66 బిలియన్ డాలర్ల మేర బకాయిలు ఉన్నాయని ఇటీవల ఒక సర్వే వెల్లడించింది.ఆర్థిక ఇబ్బందుల కారణంగా దాదాపు 4.54 లక్షల యూనిట్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి కావడం లేదని మరో వైపు ప్రాపర్టీ కన్సల్టెంట్ జెఎల్‌ఎల్ వెల్లడించింది. 2019 సెప్టెంబర్ నాటికి రియల్ ఎస్టేట్ కేటగిరీ కింద మొత్తం 115 దివాలా కేసులు దాఖలైనాయని భారత దివాలా బోర్డు నివేదికను బట్టి తెలుస్తోంది. వీటిలో 87 కేసులు పరిశీలనలో ఉండగా, మరో 28 కేసులను మూసివేయడం జరిగింది.







Untitled Document
Advertisements