టీమిండియా యువ ఆల్రౌండర్ శివమ్ దూబేకు ఆదివారం విండీస్ తో జరిగిన రెండో టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అయితే, ఆ సమయంలో ఓపెనర్ రోహిత్ శర్మ సలహాతోనే వెస్టిండీస్పై స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగానని యువ ఆల్రౌండర్ శివమ్ దూబే అన్నాడు.‘ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. అది నాకు పెద్ద విషయం. దీంతో కాస్త ఒత్తిడికి లోనయ్యాను. అయితే రోహిత్ భాయ్ నా సామర్థాలపై నమ్మకం ఉంచుకొని ప్రశాంతంగా ఆడమని సలహా ఇచ్చాడు. సిక్సర్ బాదిన తర్వాత ఆత్మ విశ్వాసం పెరిగి సహజ శైలిలో చెలరేగాను. ఏ మైదానంలోనైనా నేను సత్తా చాటగలను. అదే నా బలం. మ్యాచ్లో చేజార్చుకున్న అవకాశాలు చాలా కీలకమైనవి. అయితే ఇది ఆటలో భాగం.వారి ఫీల్డింగ్లోను తడబాటు ఉంది. మేము మంచి స్కోరే సాధించాం. అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఓటమి పాలయ్యాం. తిరిగి పుంజుకొని నిర్ణయాత్మక మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను దక్కించుకుంటాం’ అని ఆదివారం ఇక్కడ వెస్టిండీస్తో జరిగిన రెండో టి 20 మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ దూబే అన్నాడు.ఈ మ్యాచ్లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాట్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దూబే కేవలం 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 54 పరుగులు చేశాడు.